కలెక్టర్ హరిచందన
ధన్వాడ,జూన్ 7: కరోనాతో తల్లిదండ్రులు, భర్తలను కోల్పోయినవారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం ధన్వాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొవిడ్తో చనిపోయినవారి కుటుంబీకులకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలతో కలెక్టర్ మాట్లాడారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ కరోనా కాలంలో మీరు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేశామని అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టర్కు వివరించారు. నేరేడుగాం పీఠాధిపతి శ్రీ సిద్ధలింగ మహాస్వాములు సైతం తన సొంత డబ్బులను వెచ్చించి కొవిడ్ బాధిత కుటుంబాలకు సరుకులను అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విమల, ఎంపీటీసీలు జట్రం గోవర్ధన్గౌడ్, ఉమేశ్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో యశోదమ్మ, అయ్యప్ప, సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.