న్యూఢిల్లీ, ఆగస్టు 25: సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించడానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసిన 9 మంది పేర్లను కేంద్రం ఆమోదించినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది. అదే జరిగితే వచ్చే వారం ఆరంభంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలన్నీ దాదాపు భర్తీ అవుతాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్తో కలిపి 24 మంది జడ్జిలు ఉన్నారు. కొత్తగా 9 మంది నియామకం జరిగితే ఆ సంఖ్య 33కు పెరుగుతుంది. మొత్తం 34 న్యాయమూర్తుల పదవుల్లో ఒకటి మినహా అన్నీ భర్తీ అవుతాయి. ఆ ఒక్క ఖాళీ కూడా కొలీజియం సమావేశం ముగిసిన తర్వాత జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణతో ఏర్పడినదే. సుప్రీంకోర్టు జడ్జిలుగా నియామకానికి కొలీజియం సిఫారసు చేసినవారిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు.
అభ్యంతరాలు లేవనెత్తకుండా…
సుదీర్ఘ విరామం తర్వాత సీజేఐ జస్టిస్ రమణ చొరవతో ఈ నెల 17న కొలీజియం సమావేశమై అప్పటికి ఉన్న 9 ఖాళీల భర్తీకి పేర్లను ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. ఆ జాబితాలో నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు. మరో నలుగురు న్యాయమూర్తులు, మరొకరు సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ. సాధారణంగా ఇలాంటి సిఫారసులపై ప్రభుత్వం ప్రశ్నలు వేయడం, వివరణలు కోరడం పరిపాటి. కానీ, ఈ దఫా ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా ఆమోదించడం విశేషం.
తీర్పులకు అనుగుణంగా…
గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనాలు వెలువరించిన తీర్పులకు అనుగుణంగా ఈసారి సిఫారసుల్లో సామాజిక, ప్రాంతీయ వైవిధ్యానికి, లింగ సమానతకు పెద్దపీట వేశారు. సిఫారసు చేసిన 9 మందిలో ముగ్గురు మహిళలు. ఒకరు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు కాగా మరొకరు ఓబీసీ. 9 మందీ 9 రాష్ర్టాలకు చెందినవారు.