చెన్నై : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో విరుచుకుపడి పలువురి ప్రాణాలను హరిస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 4500కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక కొత్త కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో దవాఖానలు రోగులతో కిక్కిరిసి ఉండగా మహమ్మారితో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపించేందుకు స్మశానవాటికల్లో స్థలం కరువైంది. తమిళనాడు రాజధాని చెన్నైలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
చెన్నైలో కిల్పాక్ సిమెటరీ, కసిమెడు సిమెటరీ, క్విబుల్ ఐలండ్ సిమెటరీ, సెంట్ మేరీస్ కార్పొరేషన్ సిమెటరీ వంటి ప్రముఖ క్రైసవ సిమెటరీల్లో కొవిడ్-19 రోగుల అంత్యక్రియలకు స్థలం దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఆయా స్మశాన వాటికల్లో మరిన్ని మృతదేహాలకు అంత్యక్రియలు చేపట్టేలా సర్ధుబాటు చేసేందుకు సిబ్బంది అక్కడున్న చెట్లను తొలగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదని సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో మృతదేహాలు అంత్యక్రియలకు పేరుకుపోవడంతో వీటికోసం మరింత స్ధలం కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేందుకు మద్రాస్ సిమెటరీస్ బోర్డ్ ట్రస్ట్ యోచిస్తోంది.