ముంబయి : టైర్ల తయారీదారు సియట్ టైర్స్ దేశంలోని తన ఉత్పత్తుల పరిధిలో వారంటీ వ్యవధిని అదనంగా మరో మూడు నెలలు పొడిగించింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో వినియోగదారులకు సంస్థ తన మద్దతును తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 1 ఏప్రిల్,2021 నుండి 31 జూన్,2021 మధ్య గడువు ముగిసే ఉత్పత్తులకు మూడు నెలల వారంటీ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది.
సియట్ టైర్స్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ టొలాని మాట్లాడుతూ.. ఇటీవల కొవిడ్ మహమ్మారి ఉధృతి కారణంగా తమ కస్టమర్లు అనేక రాష్ట్రాల్లో ప్రయాణ పరిమితులను ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ క్రమంలో వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే నిమిత్తం తమ సంస్థ అన్ని ఉత్పత్తులపై మూడు నెలల వారంటీ పొడిగించడమైందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్షిప్లు, దాని వినియోగదారులకు ఈ వారంటీ ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు.