హైదరాబాద్ : కరోనా ఇన్ఫెక్షన్ రేటు, ఎంతమందిలో యాంటీబాడీలు ఉన్నాయనేది గుర్తించేందుకు దేశవ్యాప్తంగా సెరలాజికల్ సర్వే ను నిర్వహించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ సలహాదారు డాక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మనం ఎంత దూరంలో ఉన్నామనేది కూడా సెరో సర్వేలో అంచనా వేయవచ్చని చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందనేది కూడా ఈ సర్వేలో గుర్తించవచ్చని అన్నారు.
వ్యాక్సిన్ వేసుకున్న వారిలో యాంటీ బాడీల ఉనికినీ ఇది వెల్లడిస్తుందని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు. దేశంలో భారీ స్థాయిలో సెరో సర్వే చేపట్టడం చాలా ఉపయోగకరమని స్పష్టం చేశారు. ఇక కరోనా వైరస్ డెల్టా వేరియంట్ రెండు నెలల సమయంలో రూపాంతరం చెందవచ్చని చెప్పారు. ప్రస్తుతం పలు దేశాల్లో వెలుగుచూస్తున్న కరోనా కేసుల్లో 80 నుంచి 90 శాతం వరకూ డెల్టా వేరియంట్ కేసులేనని పేర్కొన్నారు.