ఖైరతాబాద్, మార్చి 31 : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నిమ్స్ దవాఖానలో కరోనా టీకా రెండో డోస్ వేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాము మొదటి, రెండో డోస్ వేసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, 45 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని, దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ శాతంలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.