తిరువనంతపురం: అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూటములు కలిసి కేరళ రాష్ట్రాన్ని అవినీతికి కేంద్ర బిందువుగా మార్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని కంజిరాపల్లిలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన అమిత్ షా.. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజలందరూ బీజేపీ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్, వామపక్షాల సారథ్యంలోని ఎల్డీఎఫ్తో కేరళ ప్రజలు విసుగుచెందారని అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక తికమక పార్టీ అని, ఆ పార్టీ నాయకత్వం కూడా తికమక నాయకత్వమేనని షా ఎద్దేవా చేశారు. కేరళ ఇటీవల రెండు తుపాన్లను చవిచూసిందని, ఆ తుఫాన్లవల్ల 500 మంది నిరాశ్రయులయ్యారని ఆయన చెప్పారు.
తుపాన్ల సమయంలో పినరయి విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్మీని ఆలస్యంగా రంగంలోకి దించిందని అమిత్ షా ఆరోపించారు. పినరయి సర్కారుకు రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టవని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ హయాంలో సోలార్ స్కామ్ జరిగిందని, లెఫ్ట్ పార్టీల సారథ్యంలోని ఎల్డీఎఫ్ హయాంలో బంగారం స్కామ్ జరిగిందని అమిత్షా ఎద్దేవా చేశారు.