న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలను జూలై 31వ తేదీలోగా వెల్లడించనున్నారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ విషయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ ప్రాతిపదికన విద్యార్థులకు మార్కులు వేస్తారన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టుకు కేంద్రం తన డేటాను సమర్పించింది. 11వ తరగతి, పదవ తరగతి మార్కుల ఆధారంగా 12వ తరగతి విద్యార్థులకు మార్కులు కేటాయించడం జరుగుతుందని సీబీఎస్ఈ బోర్డు పేర్కొన్నది. 12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్క్లను కలపనున్నట్లు బోర్డు తెలిపింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 11వ తరగతి పర్ఫార్మెన్స్ ఆధారంగా 30 శాతం మార్క్లు, పదవ తరగతి ఆధారంగా 30 మార్క్లు ఇవ్వనున్నట్లు బోర్డు చెప్పింది. ఒకవేళ విద్యార్థులు క్వాలిఫయింగ్ మార్క్లు సాధించకుంటే.. వారిని కంపార్ట్మెంట్ క్యాటగిరీలో పెడుతామని, మార్క్లతో సంతృప్తి చెందనివారు సీబీఎస్ఈ పరీక్షలను రాసుకోవచ్చు అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు చెప్పారు.