న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలను ఎందుకు రద్దు చేయకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.
‘ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలపై సమగ్ర వివరాలు కావాలని మేం కోరడం లేదు. కానీ గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా నిర్ణయం తీసుకుంటే మంచిదని పిటిషనర్ భావిస్తున్నారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఒకవేళ గతేడాది విధానాలకు వ్యతిరేకంగా ఉంటే గనుక అందుకు స్పష్టమైన కారణాలను వెల్లడించాల్సి ఉంటుంది’ అని కోర్టు కేంద్రానికి సూచించింది.
దీనిపై కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘పరీక్షలపై ప్రభుత్వం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. అందువల్ల గురువారం వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నా. ఆ రోజున తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని చెప్పారు. దీంతో ఈ పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది.