న్యూఢిల్లీ: 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం కొత్త స్కీమ్ను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరాన్ని రెండు విభాగాలుగా విభజించినట్లు వెల్లడించింది. ఈ మేరకు 50 శాతం సిలబస్ చొప్పున రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో తొలి విడత పరీక్షలు, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో రెండో విడత బోర్డు పరీక్షలు జరుపనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. 10, 12వ తరగతులకు టెర్మ్ల వారీగా సిలబస్ను ఈ నెలాఖరున ప్రకటిస్తామని చెప్పింది. విద్యార్థుల అంతర్గత అంచనా, ప్రాజెక్ట్ వర్స్ను మరింత విశ్వసనీయంగా నిర్వహించేలా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో బోర్డు పరీక్షలు నిర్వహించలేనందున ఈ ఏడాది రెండు విడతలుగా బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.