న్యూఢిల్లీ : సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ఇందుకు కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఒకే పరీక్షను నిర్వహించేందుకు పరీక్షల నిర్వహణ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్లో కొవిడ్ లాంటి పరిస్థితులు తలెత్తినా సకాలంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భరద్వాజ్ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను 10, 12వ తరగతి విద్యార్థులకు 50 శాతం సిలబస్తో రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు మేలో జరగాల్సి ఉండగా కరోనా ఉధృతి కారణంగా రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ పద్ధతిలో విద్యార్థులకు మార్కులు కేటాయించిన బోర్డు ఇవాళ ఫలితాలను విడుదల చేసింది.