ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 14న తమ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు పంపింది. అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు ఇతర మార్గాల నుంచి నెలకు వంద కోట్లు వసూలు చేయాలని సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజ్కు ఆయన చెప్పారని అన్నారు.
దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పరంబీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. దీనిపై స్టే కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్ముఖ్కు సీబీఐ సోమవారం సమన్లు జారీ చేసింది. దీనికి ముందు ఆయన అనుచరుడ్ని సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడుపదార్థాలతో ఉన్న వాహనం కేసు, ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్య కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది. ఈ రెండు కేసులతో ప్రమేయమున్న సచిన్ వాజ్ను సుమారు నెల రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు.
మరోవైపు సచిన్ వాజ్ కూడా ఇటీవల ఒక బహిరంగ లేఖ రాశారు. అనిల్ దేశ్ముఖ్తోపాటు ఎన్సీపీ, శివసేన నేతలు తనను డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు వసూలు చేయాలని ఆదేశించినట్లు ఆరోపించారు.