న్యూఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఒక నిబంధనను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ లేవనెత్తడంతో కేంద్రం అభీష్టం నెరవేరలేదు. సీబీఐ కొత్త చీఫ్ను ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన చర్చల సందర్భంగా ‘ఆరు నెలల నిబంధన’ను సీజేఐ లేవనెత్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీబీఐ డైరెక్టర్ ఎంపికలో గతంలో ఎప్పుడూ ఈ నిబంధన ప్రస్తావనకు రాలేదు. ఆరు నెలల కంటే తక్కువ పదవీకాలం (సర్వీసు) ఉన్న అధికారులను పోలీసు చీఫ్ పోస్టుల్లో నియామకానికి పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సీజేఐ ప్రస్తావించారు. నిబంధ నలకు అనుగుణంగా వ్యవహరించాలని సీజేఐ సూచించినట్లు సమాచారం. దీంతో సీబీఐ కొత్త డైరెక్టర్ కోసం ప్రభుత్వం షార్ట్లిస్ట్ చేసిన వారిలో అగ్రభాగాన ఉన్న బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ ఆస్థానా, ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ అనర్హులయ్యారు. జూలై 31న ఆస్థానా, మే 31న వైసీ మోదీ పదవీ విరమణ చేయనున్నారు. వారి పదవీ కాలం కనీసం ఆరు నెలలు కూడా లేకపోవడంతో సీబీఐ డైరెక్టర్ పదవికి పరిశీలన నుంచి వారి పేర్లను తొలగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సుబోధ్ కుమార్ జైస్వాల్ పేరు ఖరారైంది.