కరోనా నివారణకు బల్దియాలో 30 వాహనాల ద్వారా స్ప్రే
మురికివాడలు, మార్కెట్లపైప్రత్యేక దృష్టి
ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మృతదేహాల దహన సంస్కారాలకు ప్రత్యేక చర్యలు
వరంగల్, మే, 14: కరోనా కట్టడికోసం బల్దియా యుద్ధం చేస్తోంది. వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ పరిధిలో కొవిడ్ విస్తరించకుండా మున్సిపల్ సిబ్బంది వాడవాడలా నిరంతరం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. నగరంలోని మార్కెట్లు, బస్స్టేషన్లు, జన రద్దీ ప్రాంతాలు, మురికివాడలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు సమాచారంతో పాటు కరోనా బాధితులకు కావాల్సిన సేవలపై సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. మేయర్ గుండు సుధారాణి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు అదేశాలు ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తంగా ఉండాలని, గ్రేటర్లో వైరస్ కట్టడికి బల్దియా కీలక భూమిక పోషించాలని అధికారులకు సూచించారు.
అధికారులతో మేయర్ టెలీకాన్ఫరెన్స్
నగరంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేందుకు అధికారులు 30 వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై రెండు రోజుల క్రితం మేయర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అదేశించారు. ప్రతి ఐదు డివిజన్లకు రెండు వాహనాలను కేటాయించాలని సూ చించారు. ప్రస్తుతం నగరంలో 10 ట్రాక్టర్లు, 5 ఆటోల ద్వారా పిచికారీ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మ రో 15 వాహనాలను సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు 200 చేతిపంపు మిషన్ల ద్వారా చిన్న చిన్న వీధుల్లో బల్దియా సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేస్తున్నారు. అలాగే ఫుష్కాట్లపై యంత్రాలను ఏర్పాటు చేసి నగరంలో పిచికారి చేస్తున్నారు.
సమాచారం ఇచ్చిన వెంటనే స్పందన
కరోనా మృతదేహాల ఖననంలో బల్దియా సిబ్బంది అందిస్తున్న సేవలపై అభినందనలు వస్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ‘మృతదేహం ఉంది.. అంతిమ సం స్కారాలు చేయాలి’ అని సమాచారం అందించిన వెంటనే సిబ్బంది స్పందించి, వారి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు వాహనాలను ఏర్పాటు చేశారు. మరో రెండు డిజాస్టర్ వాహనాలు కరోనా మృతదేహాల ఖననానికి వినియోగిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది దహనసంస్కారాలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
రోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బల్దియా అధికారులు మురికివాడలపై ప్రత్యేక దృష్టిసారించి పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. గ్రేటర్ కార్పొరేషన్లోని 66 డివిజన్లలో ప్రతిరోజూ ఉదయం సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల్లో డివిజన్అంతా స్ప్రే పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.