విద్యానగర్, ఏప్రిల్ 16 :ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆకలికాదు.. అన్నం తినాలనిపించదు. బయటకు వెళ్లివస్తే చాలు ఏదైనా చల్లని పదార్థం తినాలనిపిస్తుంది. ఎక్కువశాతం చల్లని నీళ్లు లేదా పానీయాలతోనే కడుపు నింపేస్తాం. మరి ఇలాంటి మండుటెండల్లో చల్లగా దాహంతో పాటు ఆకలిని తీర్చే పండు తింటే.. అదీ పుచ్చకాయ అయితే.. ఆ మజానే వేరు కదా.. పోషక విలువలు, ఔషధ గుణాలు ఉండబట్టే ప్రజలకు ఈ పుచ్చకాయను మరీ ప్రీతికరంగా తింటుంటారు. ముఖ్యంగా వేసవిలోనే లభించడం, మండుటెండల తాపాన్ని తీర్చుకోవడానికి ఈ పుచ్చకాయే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది వండర్ మిలాన్..
పుచ్చకాయతో ఎంతో మేలు..
ప్రకృతి ప్రసాదించిన అద్భుతాల్లో పుచ్చకాయ ఒకటి. వేసవిలో విరివిగా లభించే ఈ కాయ తినాలంటే అందరికీ ఇష్టమే. అంతే కాదు పుచ్చకాయలో మనిషికి అవసరమయ్యే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కొవ్వు తక్కువ, పీచు పదార్థం ఎక్కువ. విటమిన్-ఏ, సీ, ఫోలేట్ అధికంగా ఉంటాయి. పొటాషియం పాళ్లు కూడా ఎక్కువే. సహజసిద్ధ యాంటి ఆక్సిడెంట్లకు కొదువే లేదు. మూత్రం సరిగా రానివారు.. మూత్ర విసర్జనలో మంట, మూత్రపిండాల్లో, మూత్రకోశంలో చిన్నచిన్న రాళ్లు ఉన్న వారికి పుచ్చకాయ చక్కని ఔషదంగా పనిచేస్తుంది. గ్లాసు పుచ్చకాయ రసంలో కొంచెం తేనె కలుపుకొని ప్రతిరోజూ తాగితే గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. వేసవిలో అతి దాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గుతుంటే పుచ్చకాయ తింటే నివారించబడుతుంది. జ్వరం వచ్చినప్పుడు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి తక్షణశక్తి వస్తుంది. మలబద్ధకం ఉన్న వారు ప్రతిరోజూ ఈ కాయ తింటే తగ్గిపోతుంది. ఎండిపోయే పెదవులను తడిగా ఉంచుతుంది. పుచ్చకాయలోని క్షార గుణం శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాలను, వ్యర్థపదార్థాలను తగ్గిస్తుంది. శరీరంలోని కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఏ పండులోలేనంత శాతం నీరు ఉండడం వల్ల దీనిని వాటర్ మిలాన్ అంటారు.
ఇవీ కూడా చదవండీ…
కురుమూర్తి ఆలయ హుండీ లెక్కింపు