భరత్పూర్, మే 29: కారులో వెళుతున్న డాక్టర్ దంపతులను ఇద్దరు యువకులు బైక్పై వెంబడించారు. ఓ చౌరస్తా వద్ద కారును ఓవర్టేక్ చేశారు. బైక్ను రోడ్డుపై అడ్డంగా నిలుపడంతో ఆ కారు కూడా ఆగింది. ఆ యువకులు నడిచి కారు వద్దకు వెళ్లారు. కారులోని వైద్యుడు కిటికీ అద్దం దింపాడు. ఇద్దరిలో ఓ యువకుడు వైద్య దంపతులపై కాల్పులు జరిపాడు. వెంటనే బైక్పై పరారయ్యారు. రాజస్థాన్లోని భరత్పూర్లో శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు జరిగిన ఈ జంటహత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హత్య యావత్తూ సీసీటీవీల్లో రికార్డు అయింది. పాత కక్షలతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల విచారణలో తేలింది. రెండేండ్ల కిందట జరిగిన ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతుల ప్రమేయముంది. ఆ యువతికి వైద్యుడితో వివాహేతర సంబంధం ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమె హత్య జరిగింది. దీంతో ప్రస్తుతం ఆ యువతి సోదరుడే డాక్టర్ దంపతులను కాల్చి చంపాడని పోలీసులు గుర్తించారు.