న్యూఢిల్లీ, జూలై 5: సమాచార సాంకేతికత(ఐటీ) చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సుప్రీంకోర్టు 2015లో కొట్టేసింది. కానీ ఈ సెక్షన్ కింద ఇప్పటికీ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఆరేండ్లలో పోలీసులు వేల మందిపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వానికి నోటీసులు పంపించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద ఇంకా కేసులు నమోదు కావడంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అనే ఎన్జీవో కోర్టుకు వెళ్లింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 66ఏ కింద పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా, ట్రయల్ కోర్టుల్లో విచారణ కూడా జరుగుతున్నదని పీయూసీఎల్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఏమిటీ సెక్షన్ 66ఏ
ఐటీ చట్టం సెక్షన్ 66ఏ ప్రకారం.. ఎవరినైనా అవమానించేలా, మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే శిక్షార్హులు. 2012లో శివసేన అధినేత బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు మహారాష్ట్ర బంద్ ప్రకటించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఓ యువతి పోస్ట్ పెట్టగా, మరో యువతి లైక్ కొట్టారు. దీనిపై శివసేన నేతలు ఐటీ సెక్షన్ కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శ్రేయా సింఘాల్ అనే లా విద్యార్థిని సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2015 మార్చి 24న సుప్రీంకోర్టు ఈ సెక్షన్ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.