షాజహాన్పూర్, మార్చి 6: సినిమాను తలపించే కథ ఇది. 12 ఏండ్ల వయసులో ఇద్దరు కామాంధుల పశువాంఛకు బలైన ఓ బాలిక, బిడ్డకు జన్మనిచ్చి, ఆ పసికందును మరో వ్యక్తికి అప్పగించింది. పెరిగి పెద్దయిన ఆ బాలిక 27 ఏండ్ల తర్వాత ఆ బిడ్డను కలుసుకుని నిందితులపై కేసు నమోదు చేసింది. యూపీలో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల కిందట ఆ బాలిక తన అక్క, బావతో కలిసి యూపీలోని షాజహాన్పూర్లో నివసిస్తుండేది. అదే ప్రాంతానికి చెందిన నఖీ హసన్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత అతడి సోదరుడు గుడ్డూ కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఇలా పలుమార్లు ఆ ఇద్దరూ లైంగికదాడికి తెగబడ్డారు. గర్భందాల్చిన ఆమె.. 1994లో తన 13వ ఏట ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ పసికందును బాలిక స్వస్థలమైన ఉదంపూర్లోని ఓ వ్యక్తికి పెంచుకోవటానికి ఇచ్చారు. కొన్నాళ్లకు ఆమెకు పెండ్లి అయింది. అయితే పదేండ్ల తర్వాత, ఆమె భర్తకు అత్యాచార విషయం తెలియడంతో ఆమెకు విడాకులిచ్చాడు. దీంతో ఆ దీనురాలు తిరిగి తన స్వగ్రామమైన ఉదంపూర్కి వచ్చింది. మరోవైపు, పెరిగి పెద్దయిన ఆ బాలుడు తన తల్లిదండ్రుల గురించి వాకబు చేయగా.. బాలుడిని పెంచిన ఆ వ్యక్తి అతడి తల్లి పేరును వెల్లడించారు. దీంతో అతడు తన తల్లిని కలుసుకుని జరిగిన విషయం తెలుసుకున్నాడు. అనంతరం దురాగతానికి పాల్పడిన ఆ ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదుచేయడానికి పోలీసు స్టేషన్కు వెళ్లగా కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు శుక్రవారం కేసు నమోదుచేశారు.