గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 8 ప్రధాన వార్తా పత్రికల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటనలకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్తోసహా 8 ప్రముఖ వార్తా పత్రికలకు వ్యతిరేకంగా డిస్పూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. మోడల్ ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ), ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ఏలో నిబంధనలు, మార్చి 26 భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను బీజేపీ ఉల్లంఘించిందని అస్సాం కాంగ్రెస్ లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ నిరాన్ బోరా ఆరోపించారు.
తొలి దశ ఎన్నికల్లో ఓటమిని గ్రహించిన బీజేపీ, తామే విజయం సాధించబోతున్నట్లు వార్తా పత్రికల్లో ప్రకటనల వార్తలు ప్రచురించారని ఆయన విమర్శించారు. తద్వారా మిగతా దశల పోలింగ్లో ఓటర్లను మోసగించేందుకు బీజేపీ కుట్రకు పాల్పడిందని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.