న్యూఢిల్లీ : హర్యానాలోని గురుగ్రామ్లో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు మునిగిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురుగ్రామ్లోని పాలం విహార్లోని ఓ రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. అదే రహదారిలో ఓ కారు వేగంగా వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పార్కు చేసిన కార్లు.. అలలధాటికి పక్కకు కదిలాయి.
భారత వాతావరణ శాఖ గురుగ్రామ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గురుగ్రామ్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. జులై 13న ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకిన విషయం విదితమే.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 70 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 2015 నుంచి ఇప్పటి వరకు 24 గంటల్లో ఇంత వర్షపాతం ఎప్పుడు నమోదు కాలేదని తెలిపారు. 1958, జులై 21న ఢిల్లీలో అత్యధికంగా 226.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు గుర్తు చేశారు.