న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: క్షీణదశలో ఉన్న కాంగ్రెస్లో కొనసాగే ఉద్దేశం లేదని, అలాగని బీజేపీలో చేరే ఆలోచనా లేదని పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని, తాను నమ్మిన ఆదర్శాలు ఆ పార్టీలో ఉండేందుకు అనుమతించవని చెప్పారు. పంజాబ్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఆ కోణంలో తనకున్న మార్గాలపై ఆలోచిస్తున్నానని తెలిపారు. పంజాబ్లో సరైన పరిపాలన లేకపోవడం పాకిస్థాన్కు అవకాశం ఇస్తుందని, అది రాష్ర్టానికి, దేశానికి సమస్యలు సృష్టిస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్లో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. సీనియర్ నేత కపిల్ సిబల్ ఇంటిపై పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని అమరిందర్ ఖండించారు. సెప్టెంబర్ 18న సీఎం పదవికి అమరిందర్తో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో అమరిందర్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అంతర్గత భద్రత అంశంపై షాతో చర్చించారని సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం అమరిందర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలిశారు.
రాజీనామాపై మెత్తబడిన సిద్ధూ!
పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ మెత్తబడినట్టు సమాచారం. ఆయన రాజీనామాను ఉపసంహరించుకొని పదవిలో కొనసాగనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీతో బుధవారం రెండు గంటల పాటు సిద్ధూ సమావేశమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సంప్రదింపులు జరుపడానికి సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిసింది.