కోల్కతా : దీదీ నన్ను క్షమించండి.. మీరు లేకుండా జీవించలేను.. పార్టీలోకి తనను తిరిగి తీసుకోండి అంటూ ఆవేదనతో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి నెలలో టీఎంసీ విడుదల చేసిన ఎన్నికల జాబితాలో సోనాలి గుహ పేరు లేకపోవడంతో.. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని, కేవలం మమతను తిట్టేందుకే తనను పార్టీలోకి తీసుకున్నారని సోనాలి గుహ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ కూడా ఇవ్వలేదని ఆమె వాపోయారు.
మమతకు రాసిన లేఖ సారాంశం ఏంటంటే.. బాధాకరమైన హృదయంతో ఈ లేఖ రాస్తున్నారు. టీఎంసీని వీడి మరో పార్టీలో చేరి తప్పు చేశాను. ఇది ఆవేదనతో చేసిన పని మాత్రమే. అక్కడ తాను ఇమడలేకపోతున్నాను. నీళ్లు లేకుండా చేప జీవించడం కష్టం. నేను కూడా మీరు లేకుండా జీవించలేను. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మీరు క్షమించకపోతే, నేను జీవించలేను. దయచేసి నన్ను పార్టీలోకి తిరిగి తీసుకోండి అంటూ బెంగాలీ భాషలో లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. బీజేపీలో చేరి తప్పు చేశాను. మమతను తిట్టించేందుకు తనను పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మమతను కలుస్తాను. ప్రస్తుతం ఆమె సీఎం.. బిజీగా ఉండటంతో తనకు సమయం ఇవ్వకపోవచ్చు. ఆమె సోదరుడి దశదినకర్మ వేడుకలకు హాజరై మమతను కలిసేందుకు ప్రయత్నం చేస్తానని సోనాలి గుహ పేర్కొన్నారు.