న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5.00 గంటలకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ తెలిపారు. పలువురు పంజాబ్ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఏఐసీసీ ఇవాళ సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన ట్వీట్ చేశారు.
అయితే, సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్ణయంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసహనం వ్యక్తంచేశారు. ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగలేనని వ్యాఖ్యానించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ భేటీ నేపథ్యంలో అమరీందర్ సింగ్ ఈ ఉదయమే తన సన్నిహితులైన ఎమ్మెల్యేలతో తన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సాయంత్రం జరుగబోయే సీఎల్పీ భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.