కొత్తూరును మరింత అభివృద్ధి చేసుకుందాం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
కొత్తూరులో తాగు నీటి గోస తీర్చినం : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
1, 4, 11, 12 వార్డుల్లో ఇంటింటికీ ప్రచారం
కొత్తూరు, ఏప్రిల్ 25 : ‘సీఎం కేసీఆర్ వద్ద ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు మంచి పేరు ఉన్నది.. కొత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే సీఎం కేసీఆర్ అధిక నిధులు మంజూరు చేస్తారు.. దీంతో కొత్తూరును మరింత అభివృద్ధి చేసుకోవచ్చు’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదివారం కొత్తూరు మున్సిపల్లోని 1, 4, 11, 12 వార్డుల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం 12వ వార్డులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత పాలకులు కొత్తూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ సర్కార్ అందజేస్తున్న పింఛన్లతో వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బతుకుతున్నారన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి స్పష్టంగా కన్పిస్తున్నదన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఇక్కడ అవసరాలు ఏమిటో పరిశీలించానని, వాటన్నింటినీ తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్కడి ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు అడుగుతున్నారని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు హామీ ఇచ్చారని చెప్పారు.
కొత్తూరులో నీటి గోస తీర్చినం : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొత్తూరులో నీటి గోస తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. గతంలో షాద్నగర్, కొత్తూరు పరిసర ప్రాంత ప్రజలు తాగు నీటి కోసం అరిగోస పడేవారన్నారు. నేడు మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని ఫిల్టర్ చేసి అందిస్తున్నామని, మండు వేసవిలో కూడా నీటి కష్టాలు లేవన్నారు.
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు..
టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం 12వ వార్డు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీకి చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో 1వ వార్డు అభ్యర్థి కుమ్మరి పార్వతమ్మ భిక్షపతి, 2వ వార్డు అభ్యర్థి గోవింద్నాయక్, 11వ వార్డు అభ్యర్థి ప్రసన్నలేఖ యాదవ్, 12 వార్డు అభ్యర్థి గోలి రవీందర్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, ఏనుగు జనార్దన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్రెడ్డి, ఇరగిజ్జ రమేశ్, రమాదేవి, వస్పుల సుధాకర్, పాశం కృష్ణ, పీర్లగూడెం శంకరయ్యగౌడ్ పాల్గొన్నారు.