కోల్కతా: పశ్చిమబెంగాల్లో శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. హింస చెలరేగినప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపైనా, ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు చేయకపోవడంపైనా మండిపడింది. అంతేగాక ఈ హింసాకాండపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ను కోరింది.
ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటుచేసుకుందని కలకత్తా హైకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొన్నది. రాష్ట్ర ప్రజలు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ముప్పును ఎదుర్కొంటుండటాన్ని తీవ్రంగా పరిగణించాలంది. బెంగాల్ను తనకు నచ్చిన దారిలో వెళ్లడానికి అనుమతించరాదని పేర్కొన్నది. కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తుచేసింది.
ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే కమిటీకి అవసరమైన సదుపాయాలు కల్పించాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ కమిటీకి ఏమైనా అడ్డంకులు సృష్టిస్తే కోర్టు ధిక్కారం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేసింది.