ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు (61) శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు చిత్రసీమతో నాలుగు దశాబ్దాల అనుబంధం కలిగిన ఆయన వెయ్యికిపైగా చిత్రాలకు పీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సతీమణి, దర్శకురాలు జయ.బి రెండు సంవత్సరాల క్రితం మరణించారు. ఆమె దర్శకత్వం వహించిన ప్రేమలో పావని కల్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు బీఏ రాజు నిర్మాతగా వ్యవహరించారు. సీనియర్ హీరో కృష్ణ అభిమానిగా పరిశ్రమలో అడుగుపెట్టిన బీఏ రాజు తొలుత ఆయన పబ్లిసిటీ వ్యవహరాల్ని చూసుకునేవారు. కృష్ణ ప్రోత్సాహంతో సినిమా జర్నలిస్ట్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం 1994లో సతీమణి జయతో కలిసి ‘సూపర్హిట్’ సినీ వారపత్రికను ప్రారంభించారు.
సినీ పాత్రికేయుడిగా కొనసాగుతూనే పరిశ్రమలోని పలువురు అగ్రహీరోలు, దర్శకులు, కథానాయికలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు పీఆర్వోగా పనిచేశారు. సినీ పబ్లిసిటీ వ్యవహారాల్లో తనదైన ముద్రను వేశారు. తెలుగు సినీ ప్రముఖులందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన బీఏ రాజుకు సూపర్స్టార్ కృష్ణ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో సౌమ్యుడిగా, అందరికి ఆప్తుడిగా సినీరంగంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు బీఏ రాజు. ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. బీఏ రాజుకు ఇద్దరు కుమారులు అరుణ్కుమార్, శివకుమార్ ఉన్నారు.
సినీ ప్రముఖుల సంతాపం
బీఏ రాజు హఠాన్మరణం తెలుగు చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ ప్రముఖులు, జర్నలిస్ట్లు సోషల్మీడియా వేదికగా నివాళులర్పించారు.
‘బీఏ రాజు పేరు తెలియని వ్యక్తి ఇండస్ట్రీలో ఉండరు. నా చాలా సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. సినిమాపై అద్భుతమైన పరిజ్ఞానం వున్న వ్యక్తి ఆయన. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’.
– చిరంజీవి
‘నా చిన్నతనం నుంచి ఆయనతో అనుబంధం ఉంది. వృత్తిపట్ల అంకితభావం, సినిమా అంటే అమితమైన ప్రేమ కనబరిచే గొప్ప వ్యక్తిత్వం బీఏ రాజు సొంతం. ఆయన మరణం మా కుటుంబానికి, మీడియారంగానికి పూడ్చలేని లోటుగా భావిస్తున్నా.’
– మహేష్బాబు