న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్లోగల భారతదేశ ఆస్తులను బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థ స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో ఫ్రెంచ్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఈ విషయమై రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ ఛౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నిజమే సార్, పారిస్లోని భారత ఆస్తులను కెయిర్న్ ఎనర్జి సంస్థ స్వాధీనం చేసుకోవచ్చంటూ ఫ్రెంచ్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది అని పంకజ్ ఛౌదరి తన సమాధానంలో పేర్కొన్నారు.
బ్రిటన్ ఇంధన సంస్థ కెయిర్న్ ఎనర్జీకి, భారత ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) న్యాయస్థానం కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్ అడిగినట్టు కెయిర్న్ ఎనర్జీ పన్నులు చెల్లించాల్సిన అవసరంలేదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి తమకు 1.72 బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇప్పించాలని కోరుతూ కెయిర్న్ ఎనర్జీ అమెరికా, యూకే, నెదర్లాండ్స్ న్యాయస్థానాల్లో దావాలు వేసింది.
ఈ క్రమంలోనే గత నెల 11న ఫ్రెంచ్ కోర్టు కెయిర్న్ ఎనర్జీ పిటిషన్పై విచారణ జరిపింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు మేరకు పారిస్లో ఉన్న భారత ఆస్తులను కెయిర్న్ ఎనర్జి సంస్థ స్వాధీనం చేసుకోవచ్చని తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు విషయంలో స్పష్టత కోరుతూ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు.. భారత ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పారిస్లోని భారత ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చంటూ కెయిర్న్ ఎనర్జీకి ఫ్రెంచ్ కోర్టు అనుమతి ఇచ్చిన మాట నిజమేనని స్పష్టంచేసింది.