చెన్నై: పుదుచ్చేరి క్యాబినెట్లో దాదాపు 40 ఏండ్ల తర్వాత తొలిసారి ఒక మహిళకు స్థానం లభించింది. 1980-1983 మధ్య కాంగ్రెస్–డీఎంకే కూటమి క్యాబినెట్లో డీఎంకేకు చెందిన మహిళా నాయకురాలు రేణుక అప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పుదుచ్చేరి క్యాబినెట్లో మహిళలకు మంత్రి పదవి దక్కలేదు. తాజాగా రంగస్వామి క్యాబినెట్లో మహిళకు చోటుదక్కింది. కారైక్కాల్ ప్రాంతంలోని నెడుంగాడు రిజర్వ్డ్ స్థానం నుంచి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకని మంత్రి పదవి వరించింది.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు 52 రోజుల తర్వాత తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇవాళ సాయంత్రం 3 గంటలకు పుదుచ్చేరిలోని రాజ్నివాస్లో మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. చంద్రప్రియాంకతోపాటు బీజేపీ నేతలు నమశ్శివాయం, సాయి శరవణన్ కుమార్, ఎన్ఆర్ కాంగ్రెస్కు చెందిన లక్ష్మినారాయణన్, తేని జయకుమార్లు మంత్రులుగా ప్రమాణం చేశారు.