కార్పొరేషన్, జూలై 8: పౌరులందరూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆస్తిగా అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని 42, 11 డివిజన్లలో చేపట్టిన పట్టణప్రగతిలో మేయర్ వై సునీల్రావుతో కలిసి పాల్గొన్నారు. అలాగే రూ. 25 లక్షల తో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల అస్తవ్యస్త విధానాలతో అడవులు అంతరించిపోయాయని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. ఆరు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటి కాపాడామన్నారు. ఇప్పుడు నాటే ప్రతి మొక్క భవిష్యత్తు తరాలకు ఆస్తిగా నిలుస్తుందన్నారు. 7వ విడుతలో జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందులో కరీంనగర్లో 5 లక్షల మొక్కలు నాటుతామన్నారు. పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతి నెలా పట్టణ ప్రగతి నిధులను మంజూరు చేస్తుందన్నారు. ఈ నిధులతో కరెంట్ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ విజయ, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు మేచినేని వనజ అశోక్రావు, ఆకుల నర్మద నర్సయ్య, నాయకులు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
ఆలయ పనులను సత్వరమే పూర్తి చేయాలి
నగరంలోని రేకుర్తి గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్సారార్ కళాశాల ఆవరణలో గతంలో చేపట్టి మధ్యలోనే ఆగిపోయిన కళాభారతి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రేకుర్తి గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో విశిష్టమైన చరిత్ర ఉన్న ఆలయానికి ఇప్పటికే రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కళాభారతి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ శశాంక, మేయర్ వై.సునీల్రావు, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు సుధగోని మాధవి కృష్ణగౌడ్, తోట రాములు, ఎదుర్ల రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, నందెల్లి ప్రకాశ్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.