న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం వాన దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు వాహనాలు నీట మునిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 70 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 2015 నుంచి ఇప్పటి వరకు 24 గంటల్లో ఇంత వర్షపాతం ఎప్పుడు నమోదు కాలేదని తెలిపారు. 1958, జులై 21న ఢిల్లీలో అత్యధికంగా 226.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు గుర్తు చేశారు.
సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలోని ప్రహ్లాద్పూర్ అండర్పాస్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఓ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. హోలీ ఫ్యామిలీ హాస్పిటల్, జామియా యూనివర్సిటీ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని మహిపాల్ పూర్ అండర్పాస్ లోకి కూడా భారీగా వరద నీరు వచ్చింది. దీంతో అక్కడ కూడా వాహనదారులకు ఆటంకం కలిగింది.