తిరువనంతపురం : మాస్క్ ధరించలేదని వలస కూలీపై కేరళలో ఓ బస్ డ్రైవర్ దాడికి తెగబడిన ఘటన అంగమలై బస్టాండ్ లో చోటుచేసుకుంది. కేరళ ఆర్టీసీలో పనిచేసే నిందితుడు ఓ వ్యక్తిని మాస్క్ ధరించనందుకు కర్రతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్టాండ్ లోని ఓ పిల్లర్ వద్ద మాస్క్ లేకుండా కనిపించిన ఓ పెద్దాయనను కాళ్లు, చేతులపై కర్రతో డ్రైవర్ కొడుతున్న తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాయాలతో నేలపై పడిఉన్న బాధితుడి కాళ్లు, చేతులు రక్తసిక్తమయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజిలెన్స్ విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. వలస కూలీ మాస్క్ లేకుండా బస్టాండ్ కు చేరడంపై సదరు డ్రైవర్ పోలీసులకు లేదా సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాల్సిందని, ఆయనపై దాడికి దిగడం సరైంది కాదని కేరళ ఆర్టీసీ వర్గాలు పేర్కొన్నాయి.