లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ 25 ఏండ్ల యువకుడు తన ప్రియురాలిని కాల్చిచంపి ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంభాల్ జిల్లాలోని చౌందౌసీ కొత్వాలీ ఏరియాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌందౌసీ కొత్వాలీ ఏరియాకు చెందిన శివమ్ (25), మమత (23) ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమోగానీ శుక్రవారం తెల్లవారుజామున శివమ్ తన ప్రియురాలు మమత ఇంటికి వెళ్లి దేశవాలీ తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం శివమ్ కూడా అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కాగా, శివమ్ కుటుంబసభ్యులు మాత్రం అతనిది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మమత కుటుంబసభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. దాంతో ఇరు కుటుంబాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.