వృత్తి వ్యవహారాల నుంచి కాస్త విశ్రాంతి తీసుకొని విహార యాత్రను ఆస్వాదిస్తోంది మంగళూరు సుందరి పూజాహెగ్డే. సాగర తీరంలో సరదాగా గడుపుతూ ఈ భామ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వరుస వీడియోల్ని అభిమానులతో పంచుకున్న ఈ భామ తాను వెళ్లిన ప్రదేశం తాలూకు వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. ‘అలల సవ్వడి అద్భుతంగా వినిపిస్తోంది. ఇప్పుడు ప్రతి విషయంలో పాజిటివ్గా ఫీలవుతున్నా. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి’ అని ఫొటోలపై వ్యాఖ్యానించింది పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘ఆచార్య’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాల్లో నటిస్తోంది. మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రంలో పూజాహెగ్డే నాయికగా ఖరారైంది. పవన్కల్యాణ్ కథానాయకుడిగా హరీష్శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో సైతం ఈ సొగసరిని కథానాయికగా తీసుకున్నట్లు సమాచారం. మరికొన్ని భారీ చిత్రాల్లో ఈ అమ్మడి పేరు కథానాయికగా వినిపిస్తోంది. రాబోవు రెండేళ్ల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవని అంటున్నారు.