సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తిమంతమైన మహిళల్లో నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయెల్ ఒకరని ఫోర్బ్స్ ఇండియా ట్విట్ చేసింది. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో వారి కష్టాలు, పోరాటాలు నూతన తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. శిఖాగోయెల్తో పాటు రోచి డయాబెటిస్ కేర్, కమ్యూనికేషన్ అండ్ సీఎస్ఆర్ హెడ్ కోహిలీ జలూక, టీఐఎస్ఎస్ డీన్ లక్ష్మి లింగం, తమిళనాడుకు చెందిన మొదటి ముస్లిం ఐపీఎస్, నేషనల్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ అజీతా బేగం సుల్తానాలను గుర్తించారు. నగరంలో సోమవారం మహిళా దినోత్సవాన్ని ఆడపడుచులు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకొన్నారు. వివిధ చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు భాగస్వాములయ్యారు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా అతివలు సాధిస్తున్న అసాధారణ విజయాలను కొనియాడారు. స్త్రీమూర్తుల స్ఫూర్తిదాయక సేవలు నిరుపమానమంటూ.. కీర్తించారు. మరోవైపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయెల్ నిలిచారని ఫోర్బ్స్ ఇండియా ట్వీట్ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలకు హాజరైన వక్తలు అతివల సేవలను కొనియాడారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి సన్మానాలు, సత్కారాలు చేశారు. మహిళలు వంటింటికే పరిమితం కాదని… మహిళతోనే సమాజ మనుగడ సాధ్యమని.. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.
బడంగ్పేట, మార్చి8 : మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట సామ యాదిరెడ్డి గార్డెన్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో, బడంగ్పేట పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణీదేవిని గెలిపించాలన్నారు. వాణీదేవికి అండగా నిలవాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజ్ఞప్తి చేశారు. మీలో ఒక మహిళగా గుర్తుపెట్టుకొని ఓటు వేయాలన్నారు. తన తండ్రి పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నా ఎలాంటి పదవులు ఆశించలేదని, ప్రజలకు సేవ చేసేందుకే వస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేది సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. వాణీదేవిని గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటామన్నారు. అంతకుముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సురభి వాణీదేవిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, మీర్పేట టీఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్, మార్చి 8 : మహిళలు సంపాదిస్తేనే నిర్ణయాధికారం వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీప్రైడ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు 45శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తూ వారి సాధికారతకు కృషి చేస్తున్నదని అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని పార్క్ హోటల్లో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రపంచదేశాల్లో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారని, దళిత బిడ్డలపై అదనంగా కుల వివక్ష ఉంటుందని, అలాంటి వారు ముందుకు రావాలంటే సమాజం ఆమె చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ప్రపంచం మొత్తంలో ధనవంతులు, పేదవారు అనే రెండు కులాలే ఉన్నాయని, మహిళలు డబ్బు సంపాదించడం నేర్చుకుంటే నిర్ణయాధికారం దానంతటదే వస్తుందన్నారు. కార్యక్రమంలో డిక్కీ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణా దాసరి, వుమెన్ మెంటార్ నర్నా వనజాక్షి, దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ, డీక్కీ దక్షిణ భారత ఉపాధ్యక్షులు రాహుల్ కిరణ్, ముగ్ధా ఆర్ట్స్ డైరెక్టర్ శశి వంగపల్లి, ఎవరెస్ట్ పర్వతారోహకురాలు పూర్ణా మాలోతు, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి, బాలానగర్ డీసీపీ పద్మజా, సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీతా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్,మార్చి 8: తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత పెరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
రవీంద్రభారతి, మార్చి 8: మహిళలను గౌరవించని దేశం బాగుపడదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఓబీసీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రెస్క్లబ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అరోగ్యంగా ఉంటుందని వివరించారు. కరోనా సమయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు భయపడకుండా సేవలందించారని కొనియాడారు. ఓబీసీ మహిళా సమాఖ్య చైర్పర్సన్ ఎం భాగ్యలక్ష్మి, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్రావు, ఎంబీసీ కేంద్ర కమిటీ సభ్యులు డి వేలాద్రి, బి రాణి, స్వరూప పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, మార్చి 8: కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ధైర్యంగా సేవలందించారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొవిడ్ సమయంలో అన్ని రంగాల్లోని మహిళలు విశిష్ట సేవలందించారన్నారు.
చార్మినార్, మార్చి 8 : మనమెక్కడా..? అనే సంశయంతోనే మన ప్రయాణం ప్రారంభిస్తే ఎన్నో సంచనాలను సృష్టిస్తూ సమాజానికి కొత్త నిర్వచనం అందించవచ్చని సినీ నటి మంచులక్ష్మి అన్నారు. పేట్లబుర్జ్లోని నగర పోలీస్ హెడ్ క్వార్టర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంచు లక్ష్మి మాట్లాడుతూ నాటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా నేడు మహిళలు సమాన అవకాశాలు దక్కించుకుంటూ అన్నింట్లోనూ సమానమని రుజువు చేస్తున్నారని అన్నారు. ఇటీవల నాసా మార్స్ ప్రయోగంలోనూ మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. నగర పోలీస్ విభాగం మహిళలకు ప్రత్యేక గుర్తింపు కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నగర వ్యాప్తంగా మహిళా సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారని అన్నారు. నేర ఘటనల్లోనూ ఇతరులతో పోలిస్తే మహిళా అధికారులు మరింత చాకచక్యంగా నిందితులను గుర్తిస్తున్నారని ప్రశంసించారు. పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళలందరికీ నగర పోలీస్ విభాగం తరపున సీపీ అంజనీకుమార్ సెల్యూట్ చేశారు. ప్రతి విభాగంలోనూ పలు సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని రాష్ట్ర ఇన్కం ట్యాక్స్ కమిషనర్ వసుంధర్ సిన్హా తెలిపారు. ప్రతి సమస్యలోనూ సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్లినప్పుడే ప్రత్యేకతను చాటుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర అదనపు, జాయింట్ కమిషనర్లు డీఎస్ చౌహాన్, అనిల్కుమార్, తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.
చార్మినార్, మార్చి 8 : సమాన అవకాశాలు పొందడానికి మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమలత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిటీ సివిల్ కోర్టు ఆవరణలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సుమలత మాట్లాడుతూ అవాంతరాలను అధిగమించినప్పుడే సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.