శామీర్పేట, మే 1 : సాయం కోసం ఆశ్రయించిన ఓ మహిళపై ఓ కార్పొరేటర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్నగర్ కార్పొరేటర్ పి.రవి వద్ద ఓ మహిళ 115 గజాల స్థలాన్ని రూ.7.11 లక్షలకు నోటరీ ద్వారా కొనుగోలు చేశారు. ఆ స్థలంలో నిర్మాణ పనులు చేపడుతుండగా స్థానికంగా ఇబ్బందులు వచ్చాయి. దీంతో అసంపూర్తిగా వదిలేశారు. ఇటీవల ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానిక కార్పొరేటర్ రవి వద్దకు బాధిత మహిళ కుటుంబీకులు వచ్చారు. ఇందుకు రూ.50 వేలను అడ్వాన్స్గా చెల్లించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో బాధిత మహిళ నిర్మాణం జరుగుతున్న ఇంటి వద్ద ఉండగా.. అదే సమయంలో కార్పొరేటర్ రవి అక్కడికి వచ్చాడు. ఆ మహిళ చేతిని పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి నోటిని మూసి లైంగిక దాడికి పాల్పడుతుండగా.. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు బస్స్టాప్ వైపుకు వచ్చింది. ఆమెను వెంబడించి జరిగిన ఘటనపై ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించాడు. బాధితురాలు కుటుంబ సభ్యుల సహకారంతో శనివారం జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.