ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక ఘట్టానికి తెర లేచింది. 100 శాతం వాటా విక్రయం కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నది. గతేడాది డిసెంబర్లో జరిగిన ప్రాథమిక బిడ్ల ప్రక్రియలో టాటా గ్రూప్ సహా పలు సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి. వీటిని పరిశీలించిన తర్వాత అర్హులైన పెట్టుబడిదారుల సందేహాలను వర్చువల్ పద్ధతిలో తీరుస్తారు. 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్లో విలీనం చేసినప్పటి నుంచి ఎయిర్ ఇండియాకు నష్టాలు వస్తున్నాయి. దీన్ని కొనుక్కునే సంస్థకు 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్లు దక్కుతాయి. 2017లోనే ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియ ప్రారంభమైనా ఆ సంస్థకున్న రూ.60,074 కోట్ల అప్పులను పూర్తిగా భరించాలన్న నిబంధన కారణంగా ఏ కంపెనీ ముందుకు రాలేదు.