సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ఏర్పాటు
ప్రకటించిన మంత్రి హరీశ్రావు
డీపీఆర్లు సిద్ధ్దమని.. త్వరలో టెండర్లు నిర్వహిస్తామని వెల్లడి
రెండు ఎత్తిపోతలతో 3లక్షల ఎకరాలకు సాగునీరు
సంగారెడ్డి మార్చి 18(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు చొరవ ఫలితంగా సంగారెడ్డి జిల్లా రైతాంగం సుదీర్ఘకాలం కల త్వరలో నెరవేరనుంది. గోదావరి జలాలు సంగారెడ్డి జిల్లాలో పరవళ్లు తొక్కనున్నాయి. గోదావరి జలాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి గోదావరి జలాలను జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు ఎత్తిపోతల ద్వారా పంటపొలాలకు తరలించాలని సీఎం కేసీఆర్ కాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఏర్పా టు కానున్నాయి. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిర్మాణానికి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) సిద్ధ్దమైనట్లు ప్రకటించారు. ప్రభుత్వం త్వరలోనే రెండు ఎత్తిపోతలకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. దీంతో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణం త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే సంగారెడ్డి జిల్లాలోని పంట పొ లాలు గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లా ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
3 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది. సంగారెడ్డి జిల్లాలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు సిం గూరు ద్వారా 49 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మిగతా ప్రాంతాల్లోని రైతులు చెరువులు, బోరుబావుల ద్వారా తమ పంట పొలాలకు సాగునీరు పెట్టుకుని పంటలు సాగు చేస్తున్నారు. దీనిని గుర్తించి సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా సింగూరు వరకు కాల్వ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్యాకేజీ 17,18,19 ద్వారా కాల్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే సింగూరు ప్రాజెక్టులో సుమారు 29 టీఎంసీలకు పైగా సాగునీరు అందుబాటులోకి రానుంది. ఈ జలాలను పంటపొలాలకు తరలించేందుకు వీలుగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి హరీశ్రావు పలు పర్యాయాలు ఇరిగేషన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి రెండు ఎత్తిపోతల పథకాల డీపీఆర్లు సిద్ధ్దం చేశారు.
15టీఎంసీలతో సంగమేశ్వర లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు…
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నారు. ఇందుకోసం జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 140కిలోమీటర్ల ప్రధాన కాల్వలు, 500 కిలోమీటర్ల బ్రాంచి కెనాల్లు నిర్మించనున్నారు. మునిపల్లి మండలం కంకోల్ సింగూరు బ్యాక్ వాటర్ వద్ద రిజర్వాయర్ నిర్మించనున్నారు. ఆ తర్వాత హైదీపూర్ గ్రామం వద్ద మూడు పంపులను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మొగుడంపల్లి వరకు నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి 28 కిలోమీటర్ల మేరకు జహీరాబాద్ కెనాల్, 35 కిలోమీటర్ల హందీపూర్ కెనాల్ నిర్మించి జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం మండలాల్లోని 1.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేస్తారు. అందోలు నియోజకవర్గంలోని రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని 40వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తారు. ఇక సంగారెడ్డి కెనాల్ ద్వారా సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండలాల్లోని 60వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.1800 నుంచి రూ.2వేల కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా.
బసవేశ్వరతో 88వేల ఎకరాలకు సాగునీరు…
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు. ఈ పథకం సింగూరు బ్యాక్ వాటర్ నుంచి 6టీఎంసీలను ఎత్తిపోసి కాల్వల ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 88వేల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా బోరంచవద్ద రెండు పంప్లు బిగించి నీటిని రానాపూర్ వరకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి కరస్గుత్తి కాల్వల ద్వారా పంటపొలాలకు సాగునీరు అందజేస్తారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్, కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ ప్రాంతాల్లోని 88వేల ఎకరాలకు బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందనుంది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నారాయణఖేడ్ నియోజకవర్గ ముఖ చిత్రం మారనుంది.