బెంగళూరు, జూలై 22: కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకోనున్నదా? సీఎం పదవికి యెడియూరప్ప రాజీనామా చేయనున్నారా? గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు తావిచ్చిన ఈ అంశంపై గురువారం ఆయన స్పందించారు. వారాంతం తర్వాత తాను కర్ణాటక సీఎంగా ఉండలేనేమోనని పేర్కొన్నారు. ఈ నెల 26తో యెడియూరప్ప ప్రభుత్వానికి రెండేండ్లు పూర్తికానుండటం తెలిసిందే. ఈ క్రమంలో 25న బీజేపీ అధిష్ఠానం, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని యెడియూరప్ప పేర్కొన్నారు. ‘పార్టీ నిర్ణయిస్తే ఇతరులకు సీఎం పదవి ఇచ్చేందుకు తాను సిద్ధమేనని రెండు నెలల క్రితమే చెప్పా. నేను సీఎంగా ఉన్నా.. లేకపోయినా.. బీజేపీని అధికారంలో కొనసాగించడానికి శాయశక్తులా కృషిచేస్తా. పార్టీ కార్యకర్తలు కూడా ఇందుకు సాయపడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటివరకైతే, రాజీనామా చేయాలని నన్ను ఎవరూ కోరలేదు. ఎప్పుడైతే, ఆదేశాలు వస్తాయో.. అప్పుడు వాటిని పాటిస్తా. ఆదివారం (జూలై 25న) ఏం జరుగుతుందో చూద్దాం!’ అని యెడియూరప్ప అన్నారు. రాజీనామా అంశం తెరపైకి వస్తే, కొత్త సీఎం ఎవరని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆయన దాటవేశారు.
మార్పు ఎందుకంటే?
కర్ణాటకలోని అధికార బీజేపీలో గత కొంతకాలంగా అసమ్మతి రగులుతూనే ఉన్నది. సీఎంగా యెడియూరప్పను తప్పించాలని సొంతపార్టీలోని ఒకవర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతకాలంగా అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎంకి బదులు.. ఆయన కుమారుడు మంత్రిత్వ శాఖలను నియంత్రిస్తున్నారని పర్యాటకశాఖ మంత్రి సీపీ యోగీశ్వర బహిరంగంగానే విమర్శించారు. 80% మంది పార్టీ ఎమ్మెల్యేలు సీఎం మార్పునకు సుముఖంగా ఉన్నట్టు బీజేపీ నేత ఏహెచ్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఢిల్లీకి పయనమైన యెడియూరప్ప అధిష్ఠాన పెద్దలతో చర్చలు జరిపారు. ఆరోగ్య కారణాలను చెప్పి సీఎం పదవి నుంచి దిగిపోవాలని యెడియూరప్పకు ప్రధాని మోదీ సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, వీటిని కొట్టిపారేసిన ఆయన.. తాజాగా పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.