లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి వివాహిత అయిన మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. నాలుగు రోజులపాటు బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు నిందితుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాందా జిల్లా గిర్వాన్ ఏరియాలో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గిర్వాన్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల వివాహితను మోబిన్ (30) అనే వ్యక్తి ఇటీవల పని ఉందని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను బంధించి నాలుగు రోజులపాటు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చివరికి నిందితుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా ఇంటికి వెళ్లి జరిగిందంతా తన భర్తకు వివరించింది. అనంతరం భర్తతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నివేదిక అధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.