లక్నో: మరి కాసేపట్లో జరుగాల్సిన పెండ్లిని వధువు రద్దు చేసింది. పెండ్లి వేడుక నేపథ్యంలో వరుడి బంధువులు తుపాకీతో కాల్పులు జరుపగా వధువు బంధువు గాయపడ్డాడు. దీనిని సీరియస్గా తీసుకున్న వధువు ఏకంగా పెండ్లిని రద్దు చేసింది. కాగా, ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది.
22 ఏండ్ల ఇరామ్కు బుధవారం రాత్రి షాజాద్తో వివాహం జరుగాల్సి ఉన్నది. అయితే పెండ్లి సందడి చేసిన షాజాద్ బంధువులు తుపాకీతో కాల్పులు జరిపారు. వధువు బాబాయ్కు ఒక బుల్లెట్ తగలడంతో గాయపడ్డాడు. ఈ ఘటనపై ఇరామ్ కలత చెందింది. ఆ వ్యక్తిని ఎలా పెండ్లి చేసుకోను అని ఆమె ప్రశ్నించింది. వరుడి కుటుంబ సభ్యులు తన కుటుంబం ఎదుటే ఇలా ప్రవర్తిస్తే, ఇక వారింట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తనపట్ల ఎలా ప్రవర్తిస్తారోనని ఆందోళన వ్యక్తం చేసింది.
పెండ్లిని రద్దు చేయాలన్న ఇరామ్ నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. వరుడి కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అతడి కారును ధ్వంసం చేశారు. వరుడి తరుఫు బంధువులను కొంతసేపు నిర్బంధించారు. చివరకు పోలీసుల రాకతో ఇరువర్గాల మధ్య గొడవ సద్దుమణిగింది. కాగా, గాయపడిన వధువు బంధువును ఆసుపత్రిలో చేర్చారు.
మరోవైపు వరుడు షాజాద్, అతడి సోదరులు పప్పు, సానుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ను పరిశీలించి కాల్పులు జరిపిన వారిని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. ఒకవేళ లైసెన్స్ గన్తో కాల్పులు జరిపి ఉంటే దానిని రద్దు చేస్తామని వెల్లడించారు. కాగా, పెండ్లి వేడుకల్లో జరిపే కాల్పుల్లో కొందరు మరణించడం, గాయపడిన సంఘటనలు గతంలో కూడా జరిగాయి. అయితే దీని కారణంగా పెండ్లిని వధువు రద్దు చేయడం బహుశా ఇదే తొలిసారి అని తెలుస్తున్నది.