ముంబై: కరోనా నుంచి కోలుకున్నా.. ఆ మహమ్మారి మాత్రం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు సోకిన బ్లాక్ ఫంగస్ ఎంత మందిని పొట్టనబెట్టుకుందో మనం చూశాం. తాజాగా మరో రెండు కొత్త రోగాలు కూడా కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు వస్తున్నట్లుగా తేలింది. అందులో ఒకటి బోన్ డెత్గా పిలిచే అవాస్కులర్ నెక్రోసిస్ కాగా.. మరొకటి గాల్బ్లాడర్లో నొప్పి, వాపు కనిపించడం.
ముంబైలో బోన్ డెత్ కేసులు
ఇంతకుముందు బ్లాక్ ఫంగస్ మహారాష్ట్రను వణికించినట్లే ఇప్పుడు బోన్ డెత్ లేదా అవాస్కులర్ నెక్రోసిస్(ఏవీఎన్) కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ముంబై సహా రాష్ట్రమంతా కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు ఆర్థోపెడిక్ స్పెషలిస్టులు చెబుతున్నారు. ముంబైలోని హిందూజా హాస్పిటల్లో ఇలాంటి మూడు కేసులు బయటపడగా.. తాము కూడా ఇలాంటి లక్షణాలతోనే ఉన్న పేషెంట్లను చూసినట్లు మరింత మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు చెబుతున్నారు.
గత ఐదు వారాల వ్యవధిలోనే 40 మంది ఏవీఎన్ పేషెంట్లకు తాను చికిత్స అందించినట్లు నాగ్పూర్కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుశ్రుత్ బాబుల్కర్ చెప్పారు. మరోవైపు అహ్మద్నగర్కు చెందిన విజయ్ దేశ్పాండే అనే డాక్టరే కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఏవీఎన్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాను సర్జరీ చేయించుకునే ముందే అలాంటి లక్షణాలతో ఉన్న 17 మందికి ఈయన సర్జరీలు నిర్వహించడం గమనార్హం.
అసలేంటీ ఏవీఎన్?
అవాస్కులర్ నెక్రోసిస్ (ఏవీఎన్) లేదా బోన్ డెత్ అంటే సరిపడా రక్తం లేక ఎముక కణజాలం చనిపోవడం. దీనివల్ల ఎముకలో చిన్నగా పగుళ్లు ఏర్పడి మెల్లగా అది మొత్తం పనికి రాకుండా పోతుంది. స్టెరాయిడ్లు ఎక్కువగా వాడటం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఇది సాధారణంగా కనిపిస్తోంది. మోస్తరు నుంచి తీవ్ర కొవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చేరిన పేషెంట్లు పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్ వాడటం వల్ల వారిలో ఎక్కువగా ఏవీఎన్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఏవీఎన్ లక్షణాలు ఏంటి?
ఏవీఎన్ ప్రధానంగా పిరుదులు, మెడ, భుజాలు, మోకాళ్లు, గజ్జల్లో ప్రభావం చూపిస్తుంది. మొదట్లో ఇది పెద్దగా నొప్పిగా అనిపించకపోయినా.. క్రమంగా భరించలేని స్థాయికి ఇది చేరుతుంది. బరువులు మోసినప్పుడు, పడుకుంటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు విపరీతమైన నొప్పి అనిపిస్తుంది.
గాల్బ్లాడర్ (పిత్తాశయం)లోనూ సమస్యలు
ముంబై, మహారాష్ట్రల్లో ఈ బోన్ డెత్ కేసులు ఎక్కువగా ఉండగా.. అటు ఢిల్లీలో మరో వ్యాధిని గుర్తించారు. కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లలో కొత్తగా గాల్బ్లాడర్ సమస్యలు వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. పిత్తాశయంలో వాపు, నొప్పి సమస్యలు గుర్తించినట్లు ఢిల్లీ డాక్టర్లు వెల్లడించారు. ఈ మధ్యే కొవిడ్ నుంచి కోలుకున్న 48 ఏళ్ల వయసున్న ఓ మహిళలో గాల్బ్లాడర్లో ఇన్ప్లేమేషన్ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి ఇన్ఫ్లేమేషన్ గాల్బ్లాడర్లో రాళ్లు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ మహిళకు అలాంటి సమస్య ఇప్పుడుగానీ, గతంలోగానీ లేదని ఢిల్లీలోని మూల్చంద్ మెడిసిటీ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. ఆ లెక్కన కొవిడ్ ఇలా గాల్బ్లాడర్పైనా ప్రభావం చూపుతుందన్న అంచనాకు వాళ్లు వచ్చారు.