అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సంభాషించలేమని తేల్చిచెప్పిన సందర్భం భారత ప్రభుత్వ బాధ్యతారహిత టీకా విధానాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేసింది. కేంద్రమే నేరుగా రాష్ర్టాల తరపున, దేశం మొత్తానికి సరిపోయే వ్యాక్సిన్ అవసరాన్ని గుర్తెరగాలని, కేంద్రంతోనే చర్చలు చేస్తాం తప్ప, రాష్ర్టాల వారీగా మాట్లాడబోమని సదరు సంస్థలు చెప్పిన తర్వాతైనా మోదీ ప్రభుత్వానికి కొవిడ్ టీకాపైన ఒక జాతీయ విధానం, సమగ్ర ప్రణాళిక ఉండాలనే విషయం స్ఫురిస్తుందనే ఆశిద్దాం.
‘వన్ నేషన్-వన్ టాక్స్, వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఉండాలనే వాళ్లు ‘వన్ నేషన్-వన్ వాక్సిన్’ పాలసీ ఉండాలని ఎందుకనుకోవట్లేదు! కేంద్రం కూడా సాధారణ ప్రజల వలె వస్తున్న ఉపద్రవాన్ని ఊహించలేదని, అంచనా వేయలేదని అంటున్నప్పుడు ఇక ఇంత వ్యవస్థ ఉండి ఎందుకు?
అసలు ఈ పిల్లి మొగ్గలన్నీ ఎందుకు? రూ.35 వేల కోట్లు టీకాల కోసం జాతీయ బడ్జెట్లో కేటాయించామని, దేశమంతా ఉచితంగా టీకా పంపిణీ అని, ఎక్కడ ఎన్నికలుంటే, ఆయా రాష్ర్టాల్లో మా ప్రభుత్వం వస్తే టీకాలు ఉచితమని ఊదరగొట్టిన జాతీయ పాలక పార్టీ పెద్దలు ఒక్కసారిగా మాట మార్చి, దేశం మొత్తం ఉచితంగా టీకాలివ్వటం మా బాధ్యత కాదన్నట్టు, రాష్ర్టాలకు వదలిపెట్టి చేతులు ఎందుకు దులుపుకొంటున్నారనే విషయం సగటు భారతీయునికి తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాని వైచిత్రి.
ఈ దేశంలో ప్రభుత్వ వైద్యం ఉచితం, దాంట్లో భాగంగా నేటి పరిస్థితుల్లో కొవిడ్ వైద్యంలో భాగంగా ప్రాణాధార మందులైన, వేలాది రూపాయలు ఖరీదు చేసే రెమెడెసివిర్, అంఫోతెరిసిన్ లాంటి మందులు ఉచితం, వెంటిలేటర్ సేవలు ఉచితం, ప్రభుత్వం సేవలు కాదని ప్రైవేటుకెళ్లినా ఆరోగ్యశ్రీ అనో, ఆయుష్మాన్ భారత్ అనో 2-5 లక్షల వరకు వైద్య ఖర్చులు ఉచితం అన్న పరిస్థితుల్లో, రూ.150 టీకా ఉచితంగా దేశ ప్రజలందరికీ ఇచ్చే విషయంలో కేంద్రం మీన మేషాలెందుకు లెక్కిస్తుందో విజ్ఞులెవరికీ ఊహకందని విషయం.
భారతదేశ భవిష్యత్తు బాగుండాలంటే, మనుగడ భద్రంగా ఉండాలంటే సామూహిక టీకానే తారక మంత్రం అన్న వేళ జాతీయ టీకా విధానంపై కేంద్ర పెద్దలు మౌనంగా ఎందుకుంటున్నారో తెలియని సందిగ్ధావస్థ. టీకాలు సరిపడినంత లేవనేది బహిరంగ రహస్యం. భవిష్యత్తు అవసరాలపై అంచనా గానీ, శాస్త్రీయమైన అవగాహన గానీ లేక గొప్పలకు పోయి, భగవద్గీత స్ఫూర్తితో మానవీయ కోణంలో ఎగుమతులు చేశామని ప్రధాని చెప్పిందీ బహిరంగమే. ఆ తర్వాత దేశంలో ఒత్తిడి పెరిగేసరికి దేశంలోని ఉత్పత్తిదారులకు, ఆయా దేశాలతో ఉన్న లైసెన్సింగ్, ఆర్థిక లావాదేవీలను అనుసరించి ఉన్న కమిట్మెంట్ల కారణంగానే టీకా ఎగుమతులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్న మాట కూడా వాస్తవమే.
ఆ తర్వాత సదరు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న ఎగుమతుల వినతులకు అనుమతులు దొరకని మాట కూడా వాస్తవమే. అయినా ప్రపంచం మొత్తంలో ఒక్క ఫిలిప్పీన్స్, ఇండోనేషియా మాత్రమే కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు టీకా కొనుక్కోమని అనుమతులిచ్చాయి. కానీ, ప్రజలకు వాళ్లే టీకాలు ఉచితంగా వేశారు. మిగతా ప్రపంచ దేశాలన్నీ అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆయా జాతీయ ప్రభుత్వాలే ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు వేసి విజయవంతంగా టీకా కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని మాస్కులు కూడా లేకుండా తిరిగేస్థాయికి వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఇది ఆ ప్రభుత్వాల ముందుచూపు, ఆయా దేశాధినేతల ప్రణాళికాబద్ధమైన పనితీరుకు నిదర్శనం. కానీ జాతీయ అధికార పార్టీ నేతల వాదన విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో టీకాలు వేసిన దేశంగా మనమే గొప్ప అంటారు.
మొత్తం జనాభాలో ఎంత శాతం వేశామంటే మాత్రం చెప్పరు. అమెరికా లాంటి చోట దేశ జనాభా మొత్తానికి రెండు డోసులకు సరిపోయేంత ధనాన్నిచ్చి టీకా కొనుక్కోగలిగినపుడు, ప్రపంచంలోని ఇతర సంస్థలతో సమానంగా టీకా ఉత్పత్తిలో ముందంజలో ఉన్న రెండు సంస్థలుండి, అంతర్జాతీయ సంస్థలు టీకా విక్రయానికి ముందుకొస్తున్నా దేనికోసం ఊగిసలాటనో అర్థం కాదు. ఆర్థిక ఇబ్బందులా అనుకొంటే ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో అక్షరాల్లో లక్షల కోట్ల ప్రస్తావన చూసిన వారెవరికీ అసలు అదొక సమస్యే కాదనిపిస్తుంది. మరి సమస్య ఎక్కడుంది? ‘అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ, అల్లుడి నోట్లో శని’ అనే సామెత ఈ సందర్భానికి సరైనదనిపిస్తుంది. ఢిల్లీ పెద్దల వ్యవహారశైలి ఈ సామెతకేమీ తీసిపోదనీ, ఈ సామెతలో అల్లుడేవరనే విషయం విజ్ఞులకు అర్థమైందనే భావిస్తాను.
ఇంత పెద్ద దేశంలో 270 కోట్ల డోసులు అవసరమవుతాయని అంచనా వేయలేదా? ఆ అవసరమే రాదనుకున్నారా? పీఎం టాస్క్ఫోర్స్, ఇన్సాకాగ్, ఐసీఎంఆర్ లాంటి సంస్థలు అంచనాలేమన్న ఇచ్చాయా, లేదా పరిగణనలోకి తీసుకోలేదా? అవసరం ఉన్న మేరకు ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితుల్లో ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో వృథా ప్రసంగాలు ఎవరి మేలు కోసం? 5వ అతి పెద్ద ఆర్థికవ్యవస్థ అధ్వాన్న పరిస్థితిలోకి పోవడానికి కారకులెవరు? టీకాలు ఉత్పత్తి చేసే సంస్థల సామర్థ్యం అవసరం మేరకు సరిపోదు, వాళ్లు ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం తప్పదని తెలిసినప్పుడు దేశంలోని ఆయా సంస్థలను సమాయత్తం చేయలేదెందుకు? టీకాల ఉత్పత్తిలో నైపుణ్యం ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనన్నా పటిష్ఠపరచలేదెందుకు? తీరిగ్గా సమయానికి బీఎస్-3 ప్రమాణాలు లేవనటం ఎలా సమర్థనీయం.
మొత్తంగా కొవిడ్ రెండో దశ రాదనే అవగాహనా రాహిత్యంతో, టీకాల విషయాన్ని వ్యాపార ధోరణితోనే ఆలోచించారా. ఐసీఎంఆర్ సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీతో కలిసి కొవాగ్జిన్ ఫార్ములా తయారైందని కేంద్రం, కాదు ఆ ఫార్ములా మొత్తంగా మాదే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మా ఇష్టానుసారమే తప్ప కేంద్రానికి సంబంధం లేదని భార త్ బయోటెక్ ప్రతినిధులు అంటున్నప్పుడు నిజాలు నివృత్తి చేయరెందుకు? ఒక ట్రయల్కు నిధులిచ్చి వేల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేసి వృద్ధిచేసిన ఫార్ములా మాదేనని చెప్పుకోడం ఎలా సబబు? పరిశోధనలకు, నిధులు ఇవ్వం, ఉత్పత్తి అవసరాలకు ముందస్తుగా నిధులివ్వం కానీ, టీకా తయారీలో అన్ని దశల్లో గొప్పను ప్రదర్శించే ప్రయత్నం చేయడం ఏ విధంగా సబబు? కొవిడ్ తొలి దశ నుంచి పాఠాలు నేర్వకుండా, రెండవ దశకు దేశాన్ని సిద్ధం చేయకపోవడం వల్ల జరిగిన, జరుగుతున్న నష్టానికి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రణాళికల్లో ఇన్ని లోపాలుంటే, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లోని స్థానిక బీజేపీ శాఖలు మాత్రం అక్కడి ప్రభుత్వాలను టీకాల విషయంలో ప్రశ్నిచడం, సంఖ్య విషయంలో నిందించడం ఏ రకమైన రాజకీయమో ప్రజలే తేల్చాలి. కొవిడ్ తొలి దశ నుంచి పాఠాలు నేర్వకుండా, రెండవ దశకు దేశాన్ని సిద్ధం చేయకపోవడం వల్ల జరిగిన, జరుగుతున్న నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు.
విపత్కర పరిస్థితులు మాత్రమే నాయకుని మేధోపరమైన, వ్యూహపరమైన, నిర్వహణా పరమైన, పాలనా సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. కరోనాను కేంద్రం ఎదుర్కొంటున్న తీరు చూస్తే అత్యంత విషమ పరిస్థితుల్లో దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసే సత్తా ప్రస్తుత నాయకత్వానికి ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. టీకా డోసుల మధ్య ఉండాల్సిన విరామం గురించి వేస్తున్న కుప్పిగంతులు మన వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ అసమర్థతను దాచేందుకు, టీకాల మధ్య అంతరం ఎంతైనా పర్వాలేదనే తత్వాన్ని భోదిస్తున్న కేంద్ర పెద్దలు, ప్రజల్నే నిందిస్తున్న తీరు, లోపాలను ప్రశ్నిస్తున్న వారిపై చూపిస్తున్న దౌష్ట్యం ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నది.
డిసెంబర్ కల్లా 240 కోట్ల డోసులు ఇస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఉన్నపళంగా ఇన్ని డోసులు ఎలా వస్తాయి? కేంద్ర ప్రభుత్వంఅధికారికంగా చెప్పిందా? టీకా సైప్లె కోసం కొత్త ఒప్పందాలు, చెల్లింపులు జరిగాయా? కేంద్రం ఏమైనా డెలివరీ షెడ్యూల్ ఇచ్చిందా? ఎవరూ
అధికారికంగా ధ్రువీకరించరు. అంత విశ్వాసం ఉంటే ప్రధాని ప్రకటన చేయవచ్చు కదా! చేయరు. సమాధానం లేని ప్రశ్నలెన్నో..ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపు ఏమంటే కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు లేకపోవడం, ఆ టీకా వేసుకున్నవారిని కొన్ని దేశాలు అనుమతించక పోవడం. మరి విదేశాంగ, ఆరోగ్యశాఖలు ఏం చేస్తున్నట్టు? ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం టీకాలు ఉచితంగా ఇచ్చినా, ఇవ్వకున్నా తెలంగాణతో సహా అనేక రాష్ర్టాలు టీకా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. అర డజనుకు పైగా సంస్థలు టీకాలను బహిరంగ విపణిలోకి తెస్తామనడం, రాష్ర్టాలు అనుమతిస్తుండటం కొంతలో కొంత నయం. కనీసం ఇంత జరిగాకైనా కేంద్రం ఒక సమగ్ర సామూహిక టీకా ప్రణాళిక రూపొందించడం, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయడం ప్రస్తుతానికే కాదు, భవిష్యత్తుకైనా అవసరం.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ నాయకులు)