ఫస్ట్, సెకండ్ వేవ్లో ఒక్క పాజిటివ్ కేసూ లేదు..
గ్రామపెద్దల తీర్మానానికి కట్టుబడిన గ్రామస్తులు
వైద్యారోగ్య సిబ్బంది సూచనలు పక్కాగా అమలు
క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు
ఇతర పంచాయతీలకూ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
ఇల్లెందు రూరల్, మే 17: ధనియాలపాడు.. ఇల్లెందు మండలంలో అదొక మారుమూల పంచాయతీ.. మూడు గ్రామాలతో కలిసి ఉండే ఈ పంచాయతీలో 951 మంది జనాభా. గతేడాది మార్చిలో మొదలైన ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి సెకండ్ వేవ్ వరకు.. ఒక్క కరోనా కేసు కూడా గ్రామంలో నమోదు కాలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో విస్తరిస్తున్న వైరస్ ఇప్పటివరకు ధనియాలపాడును మాత్రం తాకలేకపోయింది. అందుకు కారణం కొవిడ్ వ్యాప్తిపై గ్రామస్తులు చైతన్యవంతులు కావడమే. మరోవైపు పంచాయతీ వారు క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేయిస్తుండమూ కలిసి వచ్చింది. వైద్యారోగ్య సిబ్బంది ఎలాంటి సూచనలు ఇచ్చినా గ్రామస్తులు పక్కాగా పాటిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు చేసిన తీర్మానాలకు కట్టుబడి ఎవరూ గడపదాటడం లేదు. ఫలితంగా ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు. ఈ నేపథ్యంలో వారు తీసుకున్న జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
తీర్మానం చేస్తే జవ దాటరు..
గతేడాది మార్చిలో కరోనా ఫస్టవేవ్ ప్రారంభమైంది. ఈనేపథ్యంలో పంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తీర్మానం చేసింది. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, బయటకు వస్తే భౌతికదూరం పాటించాలని, కొత్త వ్యక్తులను గ్రామంలోకి అనుమతించవద్దని గ్రామస్తులకు సూచించారు. క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామస్తులెవరూ కూలీ పనులకు ఇతర గ్రామాలకు వెళ్లొద్దని తీర్మానించుకున్నారు. ఈ నిబంధనలను గతేడాది నుంచి ఆచరణలో పెట్టడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. ఫస్ట్వేవ్, సెకండ్వేవ్ రెండు దశల్లోనూ ఒక్క పాజిటివ్ కేసు కూడా ఇక్కడ నమోదు కాలేదు.
నిరంతర పనిచేస్తూనే కట్టడి..
ధనియాలపాడు గ్రామంలో 90 శాతం గిరిజనులే నివసిస్తున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని బాలాజీతండా, సేవ్యాతండాల్లో నూటికి నూరుశాతం గిరిజనులే. వీరందరికీ వ్యవసాయమే జీవనాధారం. వీరంతా శారీరక శ్రమను నమ్మకొని బతుకుతారు. వానకాలం, యాసంగి అనే తేడా లేకుండా గ్రామస్తులు నిరంతరం పొలం పనుల్లోనే నిమగ్నమవుతారు. కూలీల అవసరం లేకుండానే ఎవరికి వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులు చేసుకుంటారు. ఇలా నిరంతరం శ్రమిస్తూనే కరోనాను కట్టడి చేస్తున్నారు.
పారిశుధ్యంపై శ్రద్ధ..
కరోనాను గ్రామంలోకి ప్రవేశించనీయకుండా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మహమ్మారి వ్యాప్తితో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపడుతుండడమూ కలిసి వస్తున్నది. కార్మికులు ప్రతిరోజూ గ్రామంలోని మురుగుకాల్వలను శుభ్రం చేస్తున్నారు. క్రమం తప్పకుండా వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
జాగ్రత్తలు పాటిస్తున్నారు..
పంచాయతీ ప్రజలు వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తున్నారు. మాస్క్ ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పాలకవర్గం పారిశుధ్య పనులను చక్కగా చేయిస్తున్నది. అందువల్లే కరోనా ఊరి దరికి చేరలేదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.- శ్రీలత, కొమరారం పీహెచ్సీ వైద్యాధికారిణి