భువనేశ్వర్/కోల్కతా/న్యూఢిల్లీ, మే 24: ‘యాస్’ తుఫాన్ ముంచుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం తుఫాన్గా మారింది. ఇది అతితీవ్ర తుఫాన్గా బలపడి బుధవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆ సమయంలో గంటకు 155-165 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని కోల్కతా ప్రాంతీయ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సంజీవ్ బందోపాధ్యాయ్ వెల్లడించారు. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్కు దక్షిణ ఆగ్నేయం దిశగా 540 కిలోమీటర్ల దూరంలో, బెంగాల్లోని దిఘాకు దక్షిణ ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. మంగళవారానికి ఇది తీవ్ర తుఫాన్గా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాన్గా మారనున్నదని ఐఎండీ వెల్లడించింది. ఒడిశా-బెంగాల్ తీరంలోని పారాదీప్-సాగర్ దీవుల మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నదని తెలిపింది.
తుఫాన్ ముంచుకొస్తుండటంతో పశ్చిమబెంగాల్ రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. తీరప్రాంత జిల్లాలు పుర్బా, పశ్చిమ మేదినీపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాలతోపాటు హౌరా, హుగ్లీలలో మంగళవారం ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలకు ఆస్కారమున్నదని వాతావరణ విభాగం తెలిపింది. బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు, తుఫాన్ దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గాను తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించింది.
తుఫాన్ సన్నద్ధతపై కేంద్ర హోం మంత్రి అమిత్షా సమీక్ష నిర్వహించారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్లతో ఆయన వర్చువల్ మాధ్యమంలో సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు కొవిడ్ కేంద్రాల భద్రతపై ఆరా తీశారు. బెంగాల్, ఏపీ, ఒడిశాలో ఆక్సిజన్ ప్లాంట్ల భద్రతకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులను కోరారు. కేంద్ర హోం శాఖ 24/7 కంట్రోల్ రూమ్లను నిర్వహిస్తున్నదని, ఎప్పడైనా సంప్రదించవచ్చని అమిత్షా చెప్పారు. కొవిడ్-19 దవాఖానలు, ల్యాబొరేటరీలు, వ్యాక్సిన్ కోల్డ్చైన్స్, ఇతర వైద్యకేంద్రాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని ప్రత్యేకంగా సూచించినట్టు హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రంగంలోకి 149 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..
ఒడిశా, బెంగాల్లోని ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా చూడాలని తమ సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ ఆదేశాలు జారీచేసింది. సహాయక కార్యక్రమాలకు 149 బృందాలను రంగంలోకి దించినట్టు తెలిపింది. ఇదిలాఉండగా తౌటే తుఫాన్ ధాటికి అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన వరప్రధ టగ్బోట్ను వారం రోజుల తర్వాత ఐఎన్ఎస్ మకర్ నౌక సోమవారం గుర్తించింది.