రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం మొండిచేయి చూపుతోంది
వైద్య అవసరాల కోసమే తెలంగాణలో ఆరు కాలేజీల ఏర్పాటుకు సీఎం చొరవ
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం, మే 18: కొత్తగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం భద్రాద్రి ఏజెన్సీకి అద్భుతమైన వరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వైద్య రంగం విషయంలో తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. వైద్య కళాశాలల విషయంలో పక్షపాత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇటీవల దేశం మొత్తంలో 150 నూతన మెడికల్ కాలేజీల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో అంధ్రాలో ఏడు కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిందని అన్నారు. కానీ తెలంగాణకు ఒక్క కళాశాల కూడా ప్రతిపాదించకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్రం ఇలా ఎన్ని కుట్రలు చేసినా వెరువని సీఎం కేసీఆర్.. వైద్య అవసరాల కోసం రాష్ట్రంలో ఆరు కాలేజీలను ఏర్పాటుచేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగా కొత్తగూడెంలోనూ ఒక కళాశాల ఏర్పాటుచేయనుండడం విశేషమని అన్నారు. త్వరలో వెయ్యి బెడ్ల ఆసుపత్రి కూడా మంజూరు కానుందన్నారు. మెడికల్ కాలేజీకి స్థల పరిశీలన చేసి త్వరలోనే నివేదికలు పంపుతామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం: వనమా
నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్చేసి కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారని అన్నారు. కరోనా సమయంలో ఇలాంటి వరం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, సీఎంకు పాదాభివందనం చేస్తానని అన్నారు.
గిరిజన బిడ్డలకు వరం: రేగా, కోరం
గిరిజన ప్రాంతానికి మెడికల్ కాలేజీ రానుండడం ఇక్కడ బిడ్డలకు ఒక వరంలాంటిదని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మెడికల్ కాలేజీ రానుండడం ఈ ప్రాంత అదృష్టమని కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ సోనా, టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు పాల్గొన్నారు.