తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వివేక్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు. వివేక్ నటుడిగానే కాకుండా మానవతా వాదిగాను, ప్రకృతి ప్రేమికుడిగా ఎందరో మనసులు గెలుచుకున్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాంను ఇన్సిపిరేషన్గా తీసుకొని గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేఖంగా ప్రచారం చేయడంతో పాటు చెట్ల పెంపకం చేస్తూ ఉండేవారు.
2011లో కోటి మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్న వివేక్ భారీ చెట్ల పెంపకం కోసం గ్రీన్ కలాం అనే మిషన్ ప్రారంభించారు. ఇప్పటివరకు 33.23 లక్షల మొక్కలు మాత్రమే నాటారు. కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన కోరిక కలగానే మిగిలింది. కోరిక తీరకుండానే వివేక్ ఇలా ప్రకృతి ఒడిలో కలిసిపోవడం అభిమానులను దుఃఖ సాగరంలో ముంచుతుంది. నటులు సూర్య, విక్రం, నటి జ్యోతిక, మహానటి ఫేం కీర్తి సురేష్తోపాటు పలువురు ప్రముఖులు వివేక్ మృతదేహానికి నివాళుర్పించారు.రజనీకాంత్ సోషల్ మీడియా ద్వారా వివేక్కు సంతాపం తెలియజేస్తూ శివాజీ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.