ముంబై: కరోనా నేపథ్యంలో లోకల్ రైళ్లలో ప్రయాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఈ పాస్ విధానాన్ని గురువారం ప్రవేశపెట్టింది. కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిని మాత్రమే ఈ నెల 15 నుంచి లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. దీనికి సంబంధించిన ఈ పాస్ కోసం http://epassmsdma.mahait.org వైబ్సైట్ను గురువారం అందుబాటులోకి తెచ్చారు. పూర్తిగా టీకాలు తీసుకున్న వ్యక్తుల కోసం ఆఫ్లైన్ ధృవీకరణ ప్రక్రియను బీఎంసీ బుధవారం నుంచి ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ముంబై నగరంలోని 53 రైల్వే లోకల్ స్టేషన్లతోపాటు ముంబై మోట్రోపాలిటిన్ పరిధిని కలుపుకుని మొత్తం 109 స్టేషన్లలో టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఆఫ్లైన్ ధృవీకరణతోపాటు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు నెలవారీ పాస్లను జారీ చేయనున్నారు. ఇవి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారంలో ఏడు రోజులు రెండు షిఫ్ట్ల్లో పని చేస్తాయి.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆన్లైన్ ఈ పాస్తోపాటు ఆఫ్లైన్ విధానంలో కూడా నెలవారీ రైలు పాసులను ఇవ్వనున్నట్లు బీఎంసీ కమిషనర్ తెలిపారు. టీకా రెండో డోసు వేయించుకుని 14 రోజులు పూర్తయిన వారికి మాత్రమే నెలవారీ పాస్లను జారీ చేస్తామని చెప్పారు. దీని కోసం ఫొటోతో కూడిన టీకా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముంబైలో నిలిపివేసిన లోకల్ రైళ్లను ఆగస్ట్ 15 నుంచి పునరుద్ధరించనున్నారు.