పుణె, జూన్ 7: బ్లాక్ ఫంగస్కు చికిత్స రోగులకు, వారి కుటుంబసభ్యులకు తలకు మించిన భారంగా మారింది. లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. చికిత్సలో ఆంఫోటెరిసిన్ అనే ఔషధాన్ని వాడతారు. ఇది లిపోసోమాల్ రూపంలో ఉంటుంది. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.35వేల పైనే ఉంది. ప్రస్తుత డిమాండ్ కారణంగా ఇంత ధర పెట్టినా సరే ఔషధం దొరకట్లేదు. అయితే లిపోసోమాల్ రూపంలో ఉన్న ఆంఫోటెరిసిన్ లాగే సంప్రదాయ ఆంఫోటెరిసిన్ ఔషధం కూడాబ్లాక్ ఫంగస్పై సమర్థంగా పనిచేస్తుందని పుణెలోని బీజే మెడికల్ కాలేజీ ఈఎన్టీ విభాగం అధిపతి సమీర్ జోషి చెప్పారు. దీని ధర కేవలం రూ.350 మాత్రమే. అంటే 100 రెట్లు తక్కువ. సంప్రదాయ ఆంఫోటెరిసిన్పై అనవసర భయాలు సృష్టించి లిపోసోమార్ రూపంలోని ఔషధానికి డిమాండ్ సృష్టించారని సమీర్ అభిప్రాయపడ్డారు.
రోజు విడిచి రోజు రక్తపరీక్ష
సంప్రదాయ ఆంఫోటెరిసిన్ వాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇది కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. రోజు విడిచి రోజు రక్త పరీక్ష నిర్వహించి కిడ్నీలపై దాని ప్రభావం ఎలా ఉందో పరిశీలించాలని, దుష్ప్రభావం ఏమీ లేకపోతే ఔషధాన్ని వాడుతూ ఉండాలని తెలిపారు. ఒకవేళ ఏదైనా దుష్ప్రభావం కనిపిస్తే చికిత్సలో కొంత విరామం ఇచ్చి మళ్లీ మొదలు పెట్టాలని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి దీనిని ఇవ్వవద్దన్నారు. ‘సంప్రదాయ ఆంఫోటెరిసిన్ కన్నా లిపోసోమాల్ రూపంలో ఉన్న ఔషధం సురక్షితమైనదే. కానీ సంప్రదాయ ఔషధం కూడా దానితో సమానంగా బ్లాక్ ఫంగస్ను నిరోధిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది’ అని చెప్పారు. సమీర్ ఇప్పటి వరకు సంప్రదాయ ఆంఫోటెరిసిన్తో 201 మందికి చికిత్స చేశారు. వారిలో 85శాతం మంది కోలుకొన్నారు.