న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతు సంఘాలు బుధవారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ను విజయవంతం చేయాలని బీకేయూ ఏక్తా ఉగ్రహన్ పిలుపు ఇచ్చింది. కొవిడ్-19 పేరుతో రైతు ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రను తిప్పికొడుతూ మార్చ్ లో పాల్గొనాలని కోరింది. రైతులు తమ హక్కులను సాధించేవరకూ ఆందోళన కొనసాగుతుందని బీకేయూ ఏక్తా ఉగ్రహాన్ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ పేర్కొన్నారు.
మోదీ సర్కార్ పై స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రైతులు, కార్మికులు, మహిళలు పోరుబాట పట్టారని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు మోదీ సర్కార్ కొవిడ్-19ని సాకుగా వాడుతోందని దుయ్యబట్టారు. ఇక ఢిల్లీ బోర్డర్ లో రైతులు నిరసనలకు దిగిన ప్రాంతంలో వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభించాలని రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా కోరింది. ప్రభుత్వం కొవిడ్-19తో పోరాడాలని, రైతులతో కాదని సర్కార్ కు హితవు పలికింది.