మంథని టౌన్, జూన్ 6: అమరవీరుడు నాగరాజు త్యాగం చిరస్మరణీయమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. అమరవీరుడు గుండా నాగరాజు 8వ వర్ధంతిని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంథనిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి మధూకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంథని ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసి ఉవ్వెత్తున నడిపించిన ఘనత నాగరాజుదని గుర్తు చేశారు. ఆయన చేసిన త్యాగాన్ని ఈ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకునే మంథనిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్, టీఆర్ఎస్ నాయకులు బెజ్జంకి డిగంబర్, ఆసిఫ్, ఇర్ఫాన్ ఉన్నారు.
పేదల ఆరోగ్యానికి భరోసా
పేదల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని జడ్పీ చైర్మన్ మధూకర్ తెలిపారు. సెంటినరీకాలనీకి చెందిన బీ శ్రీనివాస్కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు హర్షిణితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. లాక్డౌన్తో పేదలు ఆకలితో అలమటించవద్దని రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారని వివరించారు. 57 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని జడ్పీ చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, సర్పంచులు అల్లం పద్మ, పల్లె ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.